సాగర్ ఆంకలన్ 2024-25లో ద్వితీయ స్థానం సాధించిన విశాఖపట్నం పోర్ట్
విశాఖపట్నం పోర్టు అథారిటీ మరో ఘనతను సాధించింది. ప్రతిష్టాత్మకమైన సాగర్ ఆంకలన్ లాజిస్టిక్స్ పోర్ట్ పెర్ఫార్మెన్స్ సర్టిఫికేట్ 2024-25లో ద్వితీయ స్థానాన్ని సాధించింది.
5 మిలియన్ టన్నులు మరియు అంతకంటే ఎక్కువ లిక్విడ్ బల్క్ కార్గోను నిర్వహిస్తున్న పోర్టుల విభాగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో పోర్ట్ డిప్యూటీ చైర్పర్సన్ శ్రీమతి రోష్ని అపరంజి కోరాటి, ఐఏఎస్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి శ్రీ శర్బానంద సోనోవాల్ చేతుల మీదుగా అందుకున్నారు.
ఈ ఘనత పోర్ట్ యొక్క ప్రతిభ, సామర్థ్యం, నూతన ఆవిష్కరణలు, పోర్టు అధికారులు, ఉద్యోగులు మరియు భాగస్వామ్య వర్గాల సమిష్టి కృషికి నిదర్శనంగా నిలుస్తోంది. కార్గో నిర్వహణ మరియు లాజిస్టిక్స్ రంగాల్లో అత్యుత్తమ ప్రమాణాలను కొనసాగిస్తూ విశాఖపట్నం పోర్ట్ జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది.
ఈ సందర్భంగా పోర్ట్ చైర్పర్సన్ అధికారులు, ఉద్యోగులు మరియు భాగస్వామ్య వర్గాలందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించడంలో విశేష కృషి చేసిన బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.
